రౌడీలపై ఉక్కు పాదం
అర్ధరాత్రి రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ను పరిశీలించిన ఎస్పీ
ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని సూచన
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక
మహాలక్ష్మి వాడ, ఎస్సీ కాలనీ, శాంతినగర్ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఆకస్మిక తనిఖీ
అర్ధరాత్రి 11 నుండి 1 వరకు స్పెషల్ ఆపరేషన్
అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల తనిఖీ చేశారు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్… మంగళవారం రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులలో తిరిగారు. రౌడీషీటర్ల, సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు. రౌడీలను, సస్పెక్ట్ లను పరిశీలించి వారి నేరచరిత్ర ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్మార్గంలో ప్రయాణించాలని, తిరిగి నేరాలు చేయాలనే ఆలోచన వస్తే జైలు తప్పదన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడ, శాంతినగర్, ఎస్సీ కాలనీలోని రౌడీషీటర్ల ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించి, తనిఖీ చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో సంచరిస్తున్న వారిని తనిఖీ చేసి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేశారు. అర్థరాత్రి రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలనీ సిబ్బందికి సూచించారు. రాత్రి సమయాలలో పోలీసు సిబ్బంది పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.