రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి
Road Accident in Tamilnadu: అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారుని ఢీకొన్న ఘటనలో నలుగురు అయ్యప్ప మాల ధారులు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం వాసులుగా గుర్తించారు.
విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరంతా అర్థరాత్రి 2.15 నిమిషాల సమయంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో దత్తిరాజేరు మండలం కొరపు కొత్తవలసకు చెందిన వంగర రామకృష్ణ(51), మార్పిన అప్పలనాయుడు(33), మరాడ రాము(50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు(35) ఉన్నారు.
ఈ ఘటనపై మంత్రులు స్పందించారు. మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై అధికారులను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలకు తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందించాలని హోంమంత్రి ఆదేశించారు.