టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి!

-పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరిక
-అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు.వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు.కల్వకుంట్ల కవిత నాగోబా భక్తురాలు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని కవిత విశ్వసిస్తారు.

ప‌లువురు స‌ర్పంచ్‌లు సైతం…
ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద అయిన మేస్రం ఆనందరావు చేరికతో తమ బలం రెట్టింపు అయ్యిందనే భావనలో ఉన్నారు. మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్ రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణా తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
అక్టోబర్ నెలలో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ సక్సెస్ తో జోష్ మీద ఉన్న పార్టీ క్యాడర్ లో మరింత ఉత్సాహం నింపేందుకు ఈనెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాల్లో కవిత ఉన్నారు. కొడంగల్ బహిరంగ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ నిర్వహించే తేదీని ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు,బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

You might also like