సిబ్బంది సమస్యల పరిష్కారానికే “పోలీస్ దర్బార్”
Ramagundam Police Commissionerate: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది, అధికారులకు “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలన్నారు. రామగుండం కమిషనరేట్ కి, తెలంగాణ పోలీస్ కి మంచిపేరు తీసుకురావాలన్నారు. బయట డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు చెప్పాలన్నారు.
సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తన తో విధులు నిర్వర్తిస్తే అధికారులుగా మీ వెంట ఉంటామని స్పష్టం చేశారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు అలవాటు పడి.. విధుల్లో నిర్లక్ష్యం వహించి.. పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు . ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ స్పెషల్ పార్టీ, QRT సిబ్బందితో మాట్లాడారు. ఒక్కొక్కరిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సిబ్బంది ఇచ్చిన వినతులను, సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ. రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.