మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు
CM Revanth Reddy: మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల ప్రజలు ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులన్నారు. ఒక్క ఓటేస్తే ఇద్దరు సేవకులు లభించారని అన్నారు. ఓటేసింది ప్రేం సాగర్ రావుకు అయితే, ఆయన భార్య డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ పేరుతో ప్రజలకు ఇద్దరు సేవకులు లభించారని అభినందించారు. ప్రేంసాగర్ రావు దాదాపు 16 గంటలు కష్టపడితే, ఆయన భార్య 24 గంటలు కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటారని పొగడ్తలతో ముంచెత్తారు.
తమ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ది చేయాలని చూస్తుంటే కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అనుమతులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని మీ మీ మంత్రులు, ఎంపీలే చెబుతున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు మభ్య పెడతారని ప్రశ్నించారు. మెట్రో రైలు , మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు నిధులు ఇప్పించు అప్పుడు ఓట్లు అడుగు అంటూ ముఖ్యమంత్రి కోరారు. ఎవరు అడ్డువచ్చిన తెలంగాణ అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. అడ్డొచ్చినోడి ని తొక్కుకుంటూ అభివృద్ధి చేస్తామన్నారు.