చెక్‌పోస్టులో ప్రైవేటు వ‌సూళ్లు..

Wankidi checkpost : ఇక్క‌డ మొద‌టి నుంచి ప్రైవేటు సైన్యానిదే హ‌వా.. వారు ఎంత చెబితే అంత‌.. మామూళ్లు వ‌సూళ్లు చేసి అధికారులు చెప్పిన అప్ప‌గించ‌డం వారి ప‌ని.. ఎన్నో ఏండ్లుగా త‌తంగం న‌డుస్తోంది. త‌ర‌చూ ఏసీబీ అధికారులు దాడులు చేసినా క‌నీసం వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధ‌వారం రాత్రి దాడులు నిర్వ‌హించారు. ఈ చెక్ పోస్టు లో ఏసీబీ తనిఖీలు నిర్వ‌హించ‌గా ప‌లు అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. చెక్ పోస్ట్ వద్ద అధికారులు ప్రైవేటు వ్యక్తులతో డ‌బ్బుల వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు తెలిసింది. అధికారిక సిబ్బంది కాకుండా ఇద్దరు ప్రైవేటు వ్య‌క్తుల‌తో డబ్బుల వసూళ్లు చేస్తున్నార‌ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సంద‌ర్భంగా లెక్క‌కు మించి ఉన్న రూ. 45వేల నగదు అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజయ్ కుమార్, ఐలయ్య అనే వ్యక్తుల ఫోన్లు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో సిబ్బంది పరారయ్యారు.

కేవ‌లం ఐదు కేసులు మాత్ర‌మే..
ఇంకా విస్తుపోయే విష‌యం ఏమిటంటే అంత‌రాష్ట్ర చెక్‌పోస్టు కావ‌డంతో నిత్యం వాహ‌నాల ర‌ద్దీ ఉంటుంది. అయితే బుధ‌వారం విధుల్లో ఉన్న ఎంవీఐ మాధ‌వి కేవ‌లం ఐదు కేసులు మాత్ర‌మే న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. వాంకిడి చెక్ పోస్ట్ తనిఖీలపై ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. గ‌తంలో చాలామార్లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ చెక్‌పోస్టుల‌పై నిత్యం దాడులు జ‌రుగుతున్నా అధికారులు మాత్రం క‌నీసం జంక‌డం లేదు. నిత్యం ల‌క్ష‌ల్లో వ‌సూలు చేసుకుని వాటాలు పంచుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

వ‌సూళ్ల‌కు ప్రైవేట్ సైన్యం జోరు…
కొమురంభీం అసిఫాబాద్ లో ఉన్న వాంకిడ్ ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు నిత్యం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. వాహనానికి ఓ రేటు చొప్పున వసూళ్లు చేస్తున్నారు. రవాణా శాఖ కు సంబంధం లేని ఆ వ్యక్తులు వాహనదారులపై జులుం చేస్తున్నారని గ‌తంలో ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కప్పం కటకుండా చెక్ పోస్ట్ దాటే పరిస్థితులు లేవని వాహనదారులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వ్యక్తులు సాయంత్రం కాగానే వ‌సూళ్లు అయిన మొత్తం ఎక్క‌డ ముట్ట‌చెప్పాలో అక్క‌డ ముట్ట‌చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like