కిలో చికెన్ రూ. 800, బియ్యం 339
Severe Economic Crisis in Pakistan: ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పై భారత్ విధించిన ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చన్న వార్తలతో ద్రవ్యోల్బణం కొండెక్కింది. నిత్యవసరాలు, ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆందోళనకరంగా నిత్యావసర ధరలు..
బ్రెడ్, బంగాళాదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పాకిస్తాన్లో చికెన్ ధర కిలోకు ఏకంగా రూ. 800 కి చేరింది. బియ్యం దాదాపు కిలోకు రూ. 339, గుడ్లు డజన్ రూ. 332, కిలో టమాట ధర రూ.150, పాలు లీటరు రూ. 224కి పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి విరిస్తోంది. ఆకలి చావులతో అలమటించే పరిస్థితితో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవలను కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. దీంతో చాలా కుటుంబాలు కనీసం రెండు పూటలా భోజనం కూడా భరించలేని పరిస్థితి.
నిమ్మకాయ ధర రూ. 234
పాకిస్తాన్లో నిమ్మకాయ ధర ఇప్పుడు 234 రూపాయలు, 500 గ్రాముల తేనె ధర 550 నుండి 770 రూపాయలు, నెయ్యి ధర 2వేల 895 రూపాయలుగా ఉంది. పహల్గామ్ దాడి, దాని ఫలితంగా ఏర్పడిన దౌత్యపరమైన పరిణామాల తర్వాత ఈ సూట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వాణిజ్య ఆంక్షల ప్రభావం.. భారత్ అట్టారి-వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. దీనితో దాదాపు 3,886 కోట్ల రూపాయల విలువైన సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది. ఇది పాకిస్తాన్లో ఔషధాల నుండి ఎరువుల వరకు వివిధ వస్తువుల లభ్యతను ప్రభావితం చేసింది. దీని వలన ధరలు మరింత పెరిగాయి.
ఆకలితో అలమటిస్తున్న పాక్ ప్రజలు
ఆహార భద్రత లేక కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు చాలా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తిచాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేసి, ఇప్పటికే దారుణంగా ఉన్న ఆహార భద్రత లేమితో అల్లాడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ఈ నివేదిక పేర్కొంది.