పకడ్బందీగా నీట్ పరీక్ష
NEET EXAM: మంచిర్యాల జిల్లాలో మే 4న నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో జరగనున్న పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కోసం కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమన్నారు. ప్రతి అభ్యర్థిని పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపిచనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేసవి దృష్ట్యా అభ్యర్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.