ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Cognizant: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్ న్యూస్ చెప్పింది.భారత్ లో అత్యధికంగా ఉద్యోగులను కలిగిన ఆ సంస్థ ఈ ఏడాది 20వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన త్రైమాసికంలో పెద్దగా నియామకాలు చేపట్టని సంస్థలో ప్రస్తుతం 3,36,300 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వృద్ధిని, ఆవిష్కరణలపై కంపెనీ దృష్టి సారించిన నేపథ్యంలో ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తోంది. తమ వ్యూహంలో భాగంగా ఈ ఏడాది 20 వేలమంది ఫ్రెషర్ లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ తెలిపారు.
కంపెనీ టాలెంట్ పిరమిడ్ మరింత బలోపేతరం చేసే ఉద్దేశంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తీసుకోవాలనుకుంటున్నట్లు రవి కుమార్ చెప్పారు. ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో మేనేజ్డ్ సర్వీసులకు సంబంధించిన ప్రాజెక్టులు పెరిగిన వేళ నియామకాల్లో జోరు పెంచాలని కంపెనీ భావిస్తోందన్నారు. కొత్తగా ఫ్రెషర్ లను నియమించుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచుకోవడం, మానవ మూలధన వ్యయాలను సమర్థంగా వినియోగించుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ దృష్టి సారించినట్లు రవి కుమార్ పేర్కొన్నారు. కాగ్నిజెంట్ లో సుమారు 14 వేల మంది మాజీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరగా.. మరో 10 వేల మంది త్వరలో చేరనున్నట్లు తెలిపింది.