రైతుల ఖాతాలలో రూ. 218 కోట్లు జమ
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ వెల్లడిచారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. అందులో 320 కేంద్రాల ద్వారా 22 వేల 20 మంది రైతుల వద్ద నుండి 1 లక్ష 57 వేల 710 టన్నుల పరిధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆయా రైతుల ఖాతాలలో రూ. 218.13 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు. రైతుల నుంచి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో వరిధాన్యం కొంటామన్నారు. లక్ష్యాలను పూర్తి చేసిన 131 కొనుగోలు కేంద్రాలను మూసి వేశామన్నారు. నాణ్యమైన వరిధాన్యం తీసుకు వచ్చి రైతులు కనీస మద్దతు ధర పొందాలన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనపు బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు 1,500 మంది సిబ్బంది, హమాలీలు యజ్ఞంలా పని చేస్తున్నారని చెప్పారు. నిత్యం 4 వేల నుంచి 8 వేల టన్నుల ధాన్యం కాంటా చేసి 358 లారీల ద్వారా ధాన్యం కరీంనగర్ లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు, జిల్లాలోని 20 మిల్లులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలని తెలిపారు.