ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండలం టేకులపల్లిలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పాటు గొల్లగట్టు, కన్నెపల్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జాబితాలో అర్హత గల వారి వివరాలు మాత్రమే ఉండాలన్నారు. టేకులపల్లి నర్సరీ సందర్శించి మొక్కల సంరక్షణపై తగు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సకాలంలో మొక్కలకు నీటిని అందించి జిల్లాలో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్ధం చేయాలని తెలిపారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి నిరంతరాయంగా తాగునీటిని అందించాలని, మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్లు లేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయాలని తెలిపారు. కన్నెపల్లిలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. వివిధ ధృవపత్రాల కోసం అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి ధృవపత్రాలు జారీ చేయాలని తెలిపారు. కలెక్టర్తో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్ ఉన్నారు.