మధిర, మంచిర్యాలకు నా గుండెల్లో ప్రత్యేక స్థానం
తనకు మధిర నియోజకవర్గంతో పాటు మంచిర్యాల అంటే ప్రత్యేక స్థానం తన గుండెల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఆయన మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని మరోమారు స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లా కు ఏసిసి అధ్యక్షుడు ఖర్గే వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తాము అడిగిన పనులు చేయాలని జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కోరిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం క్యాబినెట్ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడతామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. ఆనాడు రాష్ట్రంలోని రాచరిక పాలనలో, రాష్ట్ర మొత్తం దోపిడీ జరుగుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యంతో కూడిన పాలన తీసుకురావడంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల పాత్ర మరువలేనిదన్నారు. ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేపట్టగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తన అడుగులు అడుగు వేసిన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగా ఉన్నాయని స్పష్టం చేశారు. నాటి పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి ఆదిలాబాద్ జిల్లా నుంచి శంఖారావాన్ని పూరించగా, సీఎల్పీ నేతగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఏ వాగ్దానాలు చేశామో అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. లక్ష మంది పైగా ప్రజలు తరలిరావడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్థానం పదిలం చేసుకున్నారని ఈ జన సందోహాన్ని చూస్తుంటే స్పష్టం అవుతుందన్నారు. ప్రేమ్ సాగర్ రావు నిండు నూరేళ్లు జీవించాలని వెనుకబడిన ప్రాంతమైన మంచిర్యాల జిల్లా అభివృద్ధికి వారి సేవలు అవసరమని డిప్యూటీ సీఎం తెలిపారు.