వయోభారం.. ముగిసిన అజ్ఞాతం
Mavoist Party: 35 ఏండ్లుగా అజ్ఞాత వాసం… 35కి పైగా కేసులు.. దళ సభ్యుడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి దాకా ప్రస్థానం.. ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియాస్ రాజప్ప మావోయిస్టు పార్టీలో 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. వయసు మీద పడటం.. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టు పార్టీ నేతలను ఏరి వేస్తుండటంతో ఆయన భార్యతో సహా లొంగిపోయారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపెల్లికి చెందిన లచ్చన్న 1983లో దళ సభ్యునిగా చేరి చెన్నూర్ దళంలో పనిచేశాడు. 1988లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు. 1989 సంవత్సరంలో చౌదరి ఆంకుభాయి @ అనితక్క ని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు. 2002 సంవత్సరంలో DCM గా పదోన్నతి పొంది తిరిగి DK SZC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యాడు. 2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇంచార్జ్ గా నియమించింది. 2023 సంవత్సరంలో ఇతనికి DK SZCM గా పదోన్నతి లభించింది. మంగళవారం లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు. ఆత్రం లచ్చన్నపై తెలంగాణ లోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదు అయ్యాయి.
ఇక, చౌదరి ఆంకుభాయి అలియాస్ అనితక్క అలియాస్ లక్ష్మి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలానికి చెందిన వారు. అనితక్క 1988లో ఆమె అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో దళ సభ్యురాలిగా చేరారు. సిర్పూర్ దళం లో పనిచేసింది. అలా సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది. 1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు. 2002లో ACM గా పదోన్నతి పొంది తిరిగి DK SZC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్తతో పాటు బదిలీ అయ్యింది. 2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది. ఆమె ప్రస్తుతం నార్త్ బస్తర్ DVC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో DCMగా పనిచేస్తున్నారు. చౌదరి ఆంకుభాయి పై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.
లచ్చన్నకు ప్రస్తుతం 65 సంవత్సరాలు కాగా, అకుంభాయికి 55 సంవత్సరాలు వయోభారంతో పాటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఇద్దరు దంపతులు కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు.