క‌ర్ర‌లు… కారంపొడి… అట‌వీ శాఖ అధికారుల‌పై దాడి

క‌ర్ర‌లు.. కారంపొడితో అట‌వీశాఖ అధికారుల‌పై గిరిజ‌నులు దాడి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండల గ్రామాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లో పాలగోరీల ప్రాంతంలో గుడిసెలు నిర్మించారు. గుడిసెలను తొలగించేందుకు అటవీశాఖ అధికారులు అక్క‌డికి వెళ్లారు. అడవిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించమని అధికారులు వెల్ల‌డించారు. దీంతో ఆదివాసీల‌కు అటవీ శాఖ అధికారులకు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీ సిబ్బందిపై కారం చల్లుతూ, కర్రలతో  ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది పరుగులు పెట్టారు. దాడిలో అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, బీట్ అధికారి సంతోష్ గాయపడ్డారు. వారిని చికిత్స కోసం మంచిర్యాల తరలించారు.

అటవీ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారికి ఆక్రమణ చేయవద్దని, చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు రెండు, మూడు రోజులుగా గ్రామ పెద్దలు, సంఘ పెద్దల సహాయంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయినా, గుడిసెలు వేసుకోవ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. దాడికి పాల్పడిన వారిపై జన్నారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like