19న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలు
Orient Cement Factory Elections:ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల తేదీ ప్రకటించేశారు. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిన నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. 257 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై ఎన్నో రోజులుగా తర్జనభర్జనలు సాగుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో జూన్ 5న ఎన్నికలు ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. కానీ డిప్యూటీ లేబర్ కమిషనర్ లేరనే సాకుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ద్వారా కార్మిక యూనియన్లకు లేఖలు అందాయి. జూలై 8లోగా ఓటర్ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలపాలని అందులో పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఎన్నికలపై కార్మికుల్లో ఆశ చిగురించింది. కానీ, మళ్లీ ఎన్నికల విషయంలో కార్మిక శాఖ అధికారులు వెనకడుగు వేశారు.
కోర్టు సీరియస్.. ఎన్నికలకు ముందడుగు..
మరోమారి ఈ ఎన్నికలపై కార్మిక సంఘం నేతలు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఒకానొకదశలో మీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేస్తామంటూ హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ అధికారులు అల్టర్ అయ్యారు. వీలైనంత త్వరగా ఎన్నికల తేదీ వెలువరించడమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి నివేదిక అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కార్మికశాఖ అధికారులు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు.