ఆ ఇద్దరి నియామకం రద్దు
Supreme Court cancel Kodandaram MLC post:గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన ప్రొఫెసర్ కోదండారం, అలీఖాన్ నియామాకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తాజాగా నామినేట్ చేసే పేర్లు కూడా తుది తీర్పునకే లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. 2023 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది.
వీరికి రాజకీయ సంబంధం ఉందంటూ అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి ఎవర్నీ నామినేట్ చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 27న ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్ ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. గవర్నర్ ఈ నామినేషన్లను ఆమోదించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు బెంచ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారిద్దరి నామినేషన్లను తిరస్కరించడం సరికాదని పేర్కొంది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నామినేషన్ నోటిఫికేషన్ను కూడా రద్దు చేసింది. మళ్లీ కేబినెట్ కొత్తగా సిఫారసు చేయవచ్చని తెలిపింది. దీంతో మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసింది. దీనిని దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు.
దీనికి సంబంధించిన విచారణలో కోదండరాం, అలీ ఖాన్ల ఎమ్మెల్సీ నియామకాలపై ఆంక్షలను సుప్రీంకోర్టు తొలగించింది. దాంతో వీరిద్దరూ వారు ఆగస్టు 16, 2024న తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తమనే ఎమ్మెల్సీగా నియమించేలా ఆదేశాలు ఇవ్వాలన్న శ్రవణ్, కుర్ర సత్యనారాయణ విజ్ఞప్తిని మాత్రం తిరస్కరించింది. ఎమ్మెల్సీలను సిఫారసు చేయాల్సింది కేబినెట్ కాబట్టి అలాంటి ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేయలేదు.