అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం
రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల తిలక్ నగర్లో చెరువును డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లాలోని కాజ్ వేలు, వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామన్నారు.
లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, అధికారులతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. పోలీసు అధికారులకు శిక్షణ అందించామన్నారు. అదే సమయంలో గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచామని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.