ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలిగా రజియా భాను
తెలంగాణ ఉర్దూ అకాడమీ ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రజియా భాను దక్కించుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ 2022, 2023 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు చేసిన విశేష సేవలకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటించింది. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలో MPUPS జన్నారం లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రజియా బానుకి “ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డు” లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 173 మంది ఉపాధ్యాయులు ఈ గౌరవాన్ని పొందగా, రజియా బాను తన కృషి, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎ. లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రజియాభానుకి ₹25,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. ఆమె పాఠశాలలో నాణ్యమైన ఉర్దూ బోధనతో పాటు విద్యార్థుల భాషా నైపుణ్యాలు, సాంస్కృతిక విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చైల్డ్ కేర్ కార్యక్రమాలు నిర్వహించారు. తాత్కాలిక భవనాల స్థానంలో శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేసి పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధిలో విశేష పాత్ర పోషించారు.