మాదారం అడవుల్లోకి పెద్దపులి
A big tiger enters the Madaram forests: బెల్లంపల్లి రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి శనివారం మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. కొమురం భీమ్ జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పులి మూడు నెలలుగా ఇదే ప్రదేశంలో సంచరిస్తోంది. రొంపల్లి, దేవాపూర్, ధర్మారావుపేట, బెలంపల్లి పరిధిలో ఈ పులి తిరుగాడుతోంది. తిర్యాణి మీదుగా కాసిపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని వెంకటాపూర్ శివారులో ఆవుల మందపై దాడి చేసింది. ఈ పులి దాడిలో లేగదూడ మృతి చెందగా, రెండు రోజుల కిందట దేవాపూర్ రేంజ్ పరిధిలోని రొంపల్లి అటవీ ప్రాంతంలో మూడు ఆవులపై దాడి చేసింది. దాడి చేసింది ఆడ పులిగా అధికారులు గుర్తించారు.
మాదారం టౌన్షిప్కు కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో చింతలలొద్ది ప్రాంతంలో తిరుగుటున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పులి గుట్ట మీద ఉందని, అది అటు వైపు దిగితే తిర్యాణి వైపు వెళ్తుందని, లేకపోతే మాదారం వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాదారం టౌన్షిప్ ప్రాంతంలోని ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.