మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం…
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో టి.ఎన్.జి.ఓ. హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని అందించి మట్టి వినాయకుని గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వివిధ రసాయనాలు, రంగులు ఉపయోగించి తయారు చేసే గణపతి విగ్రహాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండలి ప్రతినిధులు గడియారం శ్రీహరి, గుండేటి యోగేశ్వర్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు తదితరులు పాల్గొన్నారు.