సంస్థ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తా
సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎంగా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ
Sinhareni:సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎంగా నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సంస్థ సీఎండీ బలరామ్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో ఈఅండ్ఎం శాఖ ఎంతో కీలకమైందన్నారు. ఈ బాధ్యత సమర్థంగా నిర్వహిస్తూ పూర్తి పని గంటలు యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలలో భాగంగా పెద్దఎత్తున సోలార్, థర్మల్ ప్రాజెక్టులతోపాటు ఇతర రంగాల్లోకి విస్తరిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు.
తనపై నమ్మకం ఉంచి సంస్థలో ఉన్నత స్థానానికి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి తిరుమలరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ లక్ష్యాలకు కట్టుబడి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు తమ శాఖ సమర్థంగా పనిచేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.