సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ కూల్చివేత
Cm Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని కూల్చివేశారు అధికారులు.. ఆయన సొంత గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన ఇంటి ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో 4 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని రేవంత్ ఇంటి ప్రహారిని స్థానిక ఆర్ అండ్ బీ అధికారులు అధికారులు కూల్చేశారు. కొండారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 4 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ. 8 కోట్లతో విస్తరించి పటిష్టం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
సీఎం సొంత నియోజవర్గం కొడంగల్లో రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణం కోసం భారీగా నిధులు మంజూరు అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు ఉన్న 110 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా దుద్యాల నుంచి చించోలి వరకు 45 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్ల హైవేగా నిర్మిస్తున్నారు. దీనికి కేంద్రం రూ. 600 కోట్లు మంజూరు చేసింది. దీనివల్ల కొడంగల్, తాండూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.