కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు
MRPS leaders infiltrated the Collectorate:కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(MRPS) నేతలు ఆందోళనకు దిగారు. నేతల ఆందోళన, నినాదాల నేపథ్యంలో మంచిర్యాల కలెక్టరేట్లో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కలెక్టర్ను కలిసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కలెక్టరేట్ గేట్లపై నుంచి దూకి లోపలికి ప్రవేశించిన నిరసనకారులు కలెక్టర్ ఛాంబర్లోకి దూసుకెళ్లారు. కలెక్టర్ ఛాంబర్లో ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, పోలీసులు వారికి సర్ది చెప్పి వారిని బయటికి పంపే ప్రయత్నం చేశారు. కలెక్టర్ ఛాంబర్ నుండి బయటకు వచ్చిన ఆందోళన కారులు ఏవో రాజేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదంటూ మండిపడ్డారు. వికలాంగులకు నెలకు 6 వేల రూపాయల పెన్షన్, వితంతువులు, ఒంటరి మహిళలకు 4 వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య మాదిగ, గద్దెల బానయ్య మాదిగ, రాజన్న, సుందిళ్ల మల్లేష్ మాదిగ, చుంచు శంకర్ వర్మ, మంతెన మల్లేష్ మాదిగ, గొడిసెల దశరథం, చిప్పకుర్తి మల్లేష్, వీహెచ్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నేతలు, వృద్దులు, వికలాంగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.