తుపాకీ దొంగ‌త‌నం చేసిన అగ్నివీర్‌ కానిస్టేబుల్‌

అత‌ను రెండేళ్ల కింద‌ట నావికాద‌ళంలో అగ్నివీర్ కానిస్టేబుల్‌గా చేరాడు. సోద‌రుడితో క‌లిసి ఏకంగా ఓ తుపాకీ, బుల్లెట్లు ఎత్తుకొచ్చాడు.. విచారించిన అధికారులు అత‌న్ని, ఆయ‌న సోద‌రుణ్ని అరెస్టు చేశారు. సంచ‌ల‌నం క‌లిగించిన కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి… కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట‌ మండలం, ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ 2023లో నావికా ద‌ళంలో ఉద్యోగం సంపాదించి, 2025 ఫిబ్రవరి వరకు ముంబై నావికాద‌ళంలో విధులు నిర్వహించాడు. అనంతరం బదిలీపై కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే, సోద‌రుడితో క‌లిసి ముంబై కొలాబాలోని నేవీ నగర్‌లోకి చొరబడ్డారు. తాము నేవీ సెక్యూరిటీ గార్డ్స్‌మంటూ బురిడీ కొట్టించి, అక్క‌డి నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌ 40 రౌండ్లు బుల్లెట్లతో ఉన్న దాన్ని చోరీ చేశారు. దీంతో NIAతో పాటు ATS టీంలు రంగంలోకి దిగాయి. రైఫిల్‌తో పాటు బుల్లెట్లను ఎత్తుకెళ్లిన యువకులు హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఆసిఫాబాద్‌కు చెందిన ఉమేష్‌, రాకేష్ అని గుర్తించారు. ఉమేష్‌, రాకేష్‌ను అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో పాటు మావోయిస్టు కోణంలో సైతం ATS అధికారులు విచార‌ణ చేస్తున్నారు.

ఈ కేసులో ముంబై క్రైమ్ పోలీసులకు సహకరించిన కాగజ్‌నగర్ రూరల్ సిఐ కుమారస్వామి, పెంచికల్పేట్ ఎస్సై అనిల్ కుమార్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ దేశ భద్రతకు సంబంధించిన ఆయుధాల దొంగతనం వంటి ఘటనలు అత్యంత తీవ్రమైన నేరాలని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like