చెన్నూర్ ఎస్బీఐ స్కాంలో మొత్తం బంగారం రికవరీ
All gold recovered in Chennur SBI scam:మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసులో గతంలో 15.237 కిలోల బంగారం రికవరీ చేశారు. SBFC, Indel Money, Godavari Urban, Muthoot Mini, IIFL నుంచి 15.23 కిలోల బంగారు నగలు రికవరీ చేశారు. ఇదే ఘటనలో 44 మంది నిందితులను ఆగస్టు 31న అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ముద్దాయిలు నరిగె రవీందర్, కొంగొండి బీరేష్ , కోదాటి రాజశేఖర్ లను పోలీస్ కస్టడీ కి తీసుకుని విచారించారు. ఇందులో ముత్తూట్ ఫైన్సాన్, మణప్పురంలోని పలు శాఖల నుంచి 5.250 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 20.250 కిలోల బంగారం రికవరీ చేశామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు బ్యాంక్ నుండి దొంగిలించబడిన బంగారం మొత్తం రికవరీ చేశామన్నారు. రికవరీ చేసిన బంగారం కోర్టు లో డిపాజిట్ చేస్తామని, అనంతరం బ్యాంక్ ద్వారా కస్టమర్ లకు అందించనున్నట్లు చెప్పారు.
ఈ కేసులో బంగారం రికవరీ చేయడంలో చాకచక్యంగా విధులు నిర్వహించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు దేవేందర్ రావు, ఆర్. బన్సీలాల్, వేణు చందర్, బాబురావు CCS, ఎస్ఐలు సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోష్, లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వర్, మధుసూదన్, హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, పీసీలు రవి, రమేష్, ప్రతాప్, తిరుపతి, లింగమూర్తి, CCS సిబ్బంది జయచంద్ర, భరత్ తదితరులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
చెన్నూరు ఎస్బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారాన్ని బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందర్, మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ప్రైవేట్ ఫైనా న్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి దందా నడిపించారు. ఈ ఘటనలో బ్యాంకు లో 12.61 కోట్ల విలువైన 402 గోల్డ్లోన్ ఖాతాల ఆభరణాలు (25.17కిలోల బంగారం), నగదు 1.10 కోట్లు గల్లంతైనట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బంగారం వస్తుందో రాదోనని ఆందోళన చెందిన ఖాతాదారులకు పోలీసులు మొత్తం బంగారం రికవరీ చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.