కలెక్టర్పై కేసు పెడతాం..
బీఆర్ఎస్పై అధికారులు కక్షగట్టి ప్రవరిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. కలెక్టరేట్ కూలిపోయిందని హెల్మెట్లు ధరించి చూసేందుకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడతారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని బోర్డు పెట్టారా…? అన్నారు. కలెక్టరేట్ కప్పు కూలిపోవడానికి కారణం కలెక్టరేనని స్పష్టం చేశారు. కలెక్టర్పై ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పారు జోగు రామన్న. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని కాంగ్రెస్ మంత్రుల ఆదేశాలతో తొత్తులుగా మారి మా కార్యకర్తలపై కేసులు పెట్టారని ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారాయన.
ప్రభుత్వ అధికారుల కబ్జాలు, రాజకీయ నాయకుల కబ్జాలు చేస్తుంటే వాటిని ఎందుకు తొలగించడం లేదన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పార్టీ కార్యాలయాలను నిర్మిస్తే వాటి జోలికి ఎందుకు పోవడం లేదని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల పైనే మీ ప్రతాపమా..? అక్రమాలు చేసే బడాబాబులను ఎందుకు వదిలేస్తున్నారన్నారు. కబ్జాలు చేసిన నాయకులను, అలాగే సేల్ డీడ్లను తీసుకొని డబ్బులు తీసుకునే వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదన్నారు. ఎమ్మెల్యే కబ్జాలు చేశాడని కాంగ్రెస్ నేత ఆధారాల తో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జోగు రామన్న ప్రశ్నించారు.