యూరియా చోరీకి పాల్పడుతోంది కాంగ్రెస్
Congress is involved in urea theft:తెలంగాణలో యూరియా చోరీకి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండియ సంజయ్ ఆరోపించారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా అందకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనేనని దుయ్యబట్టారు. రైతుల ఆశలను ఆవిరి చేయడమే కాదు, నోటికాడి ముద్దను లాగేస్తున్నదీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేంద్రం రబీ సీజన్ కు 12లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే, అందులో 2.05లక్షల మెట్రిక్ టన్నులను కాంగ్రెస్ పార్టీ మాయం చేసిందన్నారు. యూరియా దర్జాగా బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించేలా చేయడమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే మనుషులు లారీలతో వాటిని స్మగ్లింగ్ చేసేలా సహకరిస్తున్నదని దుయ్యబట్టారు. రైతులకు మేలు చేసేలా కాంగ్రెస్ వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ, పారదర్శకత కానీ లేదన్నారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడంలో మాత్రం ముందుంటుందన్నారు.
యూరియా బ్లాక్ తరలుతోంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్ మెన్ లారీ యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడానికి ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిల్లో కాంగ్రెస్ వాళ్లు చాలా ఎక్స్పర్ట్స్ అంటూ ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ కు ప్లానే లేదు. రబీ యూరియా వినియోగంపై లెక్కా పత్రం లేదన్నారు. ఇదేమని అడిగితే.. కేంద్రాన్ని బదనాం చేయడమే పెట్టుకున్నరని దుయ్యబట్టారు. ఇకనైనా కేంద్రాన్ని బదనాం చేయడం పక్కనపెట్టి యూరియా విషయంలో రైతులు పడుతున్న బాధను అర్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని కోరుతున్నానంటూ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.