ఎన్కౌంటర్ మృతులు వీరే..
Gadchiroli encounter:మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎటపల్లి తాలూకా పోస్ట్ గట్టా జాంబియా పరిధిలోని మౌజా మొడస్కే అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక ఆటోమేటిక్ AK 47 రైఫిల్, ఒక ఆధునిక పిస్టల్, మందుగుండు సామగ్రి, రెండు వాకీటాకీలు, పెద్ద మొత్తంలో మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్కౌంటర్లో కమాండర్ హోదాలో ఉన్న సీనియర్ కేడర్, ఒక ACM చనిపోయారు. వారిలో ఒకరు ఐరి తాలూకాలోని మద్వేలీకి ప్రాంతానికి చెందిన సుమిత్ర అలియాస్ సునీతా వెలాడిగా గుర్తించారు. ఆమె ఎల్వోఎస్ కమాండర్గా కొనసాగుతున్నారు. ఆమె పేరిట ఎనిమిది లక్షల రివార్డు ఉంది. 12 హత్య కేసులతో సహా మొత్తం 31 కేసులు ఉన్నాయి. ఇక మరణించిన మరో మావోయిస్టు లలిత అలియాస్ లడ్డో అలియాస్ సంధ్య కోర్సాగా గుర్తించారు. ఆమె పేరిట ఆరు లక్షల రివార్డు ఉంది. నాలుగు హత్యలతో సహా తనపై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె కాంకేర్ జిల్లా నెల్టోలా వాసి అని.. గట్ట దలాం DVCM రాజు వెలాడి భార్య అని వారు స్పష్టం చేశారు.