దారి తప్పిన యూరియా
Urea:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా పక్కదారి పట్టింది. లోడ్లకు లోడ్లు రాత్రికి రాత్రే ఫెర్టిలైజర్ షాపు యజమానులు ఖాళీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామంలో రెండు లారీల యూరియా కొండయ్య పెర్టిలైజర్, శ్రీ ఆంజనేయ ఆగ్రోలకు 266 బస్తాల చొప్పున మొత్తం 532 బస్తాలు తీసుకొచ్చారు. వ్యవసాయ అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే ఈ యూరియా సరఫరా జరిగింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి ప్రేమలత వెళ్ళి చూడగా సుమారుగా రెండు షాపులలో కేవలం 90 బస్తాలు మాత్రమే మిగిలాయి. దీంతో పై అధికారులకు సమాచారం అందించి మిగిలిన బస్తాలను సీజ్ చేశారు. యూరియా విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నో సేల్ బోర్డ్ ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ అధికారి ప్రేమలత తెలిపారు.
ఇక ఇదే జిల్లాలోని సిర్పూర్(టి) మండలం భూపాలపట్నంలో సైతం అదే విధంగా రాత్రికి రాత్రే లారీలోడ్ యూరియా పంపిణీ చేస్తుండగా కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యూరియా అన్ లోడ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. యూరియా లారీని స్దానిక డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాగజ్నగర్ లోని ఒక ప్రైవేట్ డీలర్ అర్థరాత్రి యూరియా పంపిణీ చేయడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియా ఎక్కువకు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారా..? లేక మొత్తానికే మాయం చేయాలని ప్రయత్నించారా..? అనేది తేలాల్సి ఉంది.