బాసరలో ఘనంగా నవరాత్రులు.. కుష్మాండ దేవీగా అమ్మవారు..
Basara Temple:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. అల్లం వడలు (గారెలు) నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నాలుగు గంటలకు మంగళ వాయిద్య సేవతో పాటు గణపతి పూజ, చతుష్షష్టి పూజలను అర్చకులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివేదన హారతి, పూజలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
కూష్మాండ దేవి అవతారం విశిష్టత..
‘కు’ అంటే చిన్న, ‘ఊష్మ’ అంటే శక్తి, ‘అండా’ అంటే విశ్వం.. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం. ఎనిమిది భుజాలు కలిగి విరాజిల్లుతుండటం వల్ల అమ్మవారిని ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు. ఆ ఎనిమిది చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ రోజు అమ్మవారి వాహనం పులి. విశ్వం అంతా చీకటే అలుముకున్నప్పుడు తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండ దుర్గా దేవి అని, సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.