గ్రూప్ 1 ఫలితాల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల జయకేతనం..
Basara Triple IT students triumph in Group-1 results:గ్రూప్-1 ఫలితాల్లో బాసర ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థులు సత్తాచాటారు. ఇక్కడ చదువుకున్న 12 మంది విద్యార్థులకు కొలువులు దక్కాయి. ఇందులో 8 మంది డీఎస్పీగా ఉద్యోగాలు లభించాయి. మరో నలుగురు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు సంపాదించారు. మొత్తం 12 మంది గ్రూప్ 1 తుది ఫలితాల జాబితా లో చోటు దక్కించుకున్నట్లు ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ ప్రకటించారు.
కష్టించేవాడి వెనుకే విజయలక్ష్మీ నడిచొస్తుందంటారు పెద్దలు. ఏ కష్టాన్నైనా ఇష్టంగా చేయడమే ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నైజం. దానికి తార్కాణంగా రెండు రోజుల కిందట విడుదలైన గ్రూప్ -1 ఫలితాలలో ట్రిపుల్ ఐటీ బాసర పూర్వ విద్యార్థులు జయకేతనాన్ని ఎగురవేసారు. ఇందులో 8 మంది డి.ఎస్.పి.లుగా ఎంపికయ్యారు. వారిలో బి 08 బ్యాచ్కు చెందిన ఎన్.స్వామి (సిద్ధిపేట), బి. అమరేందర్ (ఆదిలాబాద్), బి09 బ్యాచ్కు చెందిన సి.హెచ్. ఆదికేశవరెడ్డి(హైదరాబాదు), ఎస్. సాయి చరణ్ (నల్లగొండ), బి11 బ్యాచ్కు చెందిన జి. నిఖిల (నిజామాబాదు), సి. భవాని (నల్లగొండ), బి12 బ్యాచ్ విద్యార్థి ఎల్. శ్రీకాంత్ (సిద్ధిపేట), బి14 బ్యాచ్ విద్యార్థిని ఎం. కవిత (వనపర్తి) ఈ ఎనిమిది మంది డీఎస్పీలుగా ఎంపికయ్యరు. వీరితో పాటు బి08 బ్యాచ్ విద్యార్థి డి. శ్రీరాం కుమార్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంటుగా, బి09 విద్యార్థి వి. రాజశేఖర్ రెడ్డి(సూర్యాపేట) కమర్షియల్ ట్యాక్సు ఆఫీసరుగా, బి11 బ్యాచ్కి చెందిన ఎం. సురేశ్(కరీంనగర్) మండల పరిషత్ డెవలప్మెంటు ఆఫీసరుగా, మరో విద్యార్థి వెంకటేష్ ఆడిట్ ఆఫీసరుగా ఎంపికయ్యారు. విద్యార్థుల ఘనవిజయానికి ఆర్జీయుకేటి ఉపకులపతి ఏ. గోవర్ధన్, ఓఎస్డి ఇ. మురళీ దర్శన్, ఇతర అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభివృద్ధే ఆర్జీయుకేటి బాసర లక్ష్యమన్నారు.