సమృద్ధిగా యూరియా నిల్వలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో పంట సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ కుమారి దీపక్ అన్నారు. ఆదివారం చెన్నూరు మండలం సుద్దాలలో ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి యామిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. యూరియా నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాలోని రైతులందరికీ పంట సాగుకు అవసరమైన యూరియా అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
జిల్లాలో వ్యవసాయ సాగుకు యూరియా అందుబాటులో ఉందన్నారు. సాగుకు అవసరమైన యూరియా తీసుకొని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముందస్తు సాగుకు, అవసరానికి మించి యూరియా తీసుకోకూడదన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సాగు చేస్తున్న రైతులకు సమయానుకూలంగా యూరియా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు సహకరించాలని తెలిపారు.
అంతకుముందు చెన్నూరు బాలాజీ ఫంక్షన్ హాల్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, సర్వే ల్యాండ్ ఎ.డి. శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు ఇతర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు.