890 గ్రామ పంచాయతీల ఏకగ్రీవం
Local body elections in Telangana:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 890 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని(State Election Commissioner Rani Kumudini) తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే బందోబస్తు, శాంతిభద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. పోలింగ్ పూర్తి కాగానే అదే రోజు కౌంటింగ్ జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో మొదటి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీం అయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గ్రామాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందన్నారు. ఆ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రేపు రాష్ట్రంలో 3,838 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ ఉంటుందని తెలిపారు. ‘తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికల్లో విధుల్లో లక్ష మందికిపైగా సిబ్బంది పాల్గొంటారు.’ అని ఎస్ఈసీ రాణి కుముదిని పేర్కొన్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మెుత్తం మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. మెుదటి దశ డిసెంబర్ 11, రెండో దశ డిసెంబర్ 14, డిసెంబర్ 17వ మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.