తక్కువ ఓట్లతో… తలరాత మారింది..
Election Results: సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకమే అని నేతలు భావిస్తుంటారు. ఈ సమయంలో ఓ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థి భవితవ్యం తలకిందులు అవడం ఖాయం. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా జరిగిన మొదటి విడత స్థానిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.
తొలి విడత పోలింగ్లో అనేకచోట్ల ఫలితాలు ఉత్కంఠభరితంగా వచ్చాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిద్ పల్లి సర్పంచ్గా జాదవ్ సంతోష్ మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హన్మకొండ జిల్లా ఆరేపల్లిలో అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కామారెడ్డి జిల్లా ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే అభ్యర్థి 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం, చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్.. కేవలం 9 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత.. కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మండలంలోని కందిగడ్డతండా గ్రామంలో మాలోతు బోరిలాల్ నాయక్.. కేవలం 14 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఇంకా చాలా చోట్ల ఫలితాలు బయటకు వస్తున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని అధికారులు కోరుతున్నారు.