మాట నిలబెట్టుకున్న ఎంపీ
MP Vamshi Krishna:గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మీకు బస్సు సౌకర్యం కల్పిస్తామని వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆయన ఈ రోజు మూడు బస్సులను ప్రారంభించారు. శుక్రవారం హాజీపూర్ మండలం గుడిపేటలోనిప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను కలెక్టర్ కుమార్ దీపక్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు రేఖ, జగతీ దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు.
చదువుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఉన్నత చదువులు అభ్యసించి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ అందించడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రామగుండం, బెల్లంపల్లి, రేచిని ఇతర ప్రాంతాలలో ఓవర్ బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల కోసం నూతన శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల హెచ్ ఓ డి శ్రీకాంత్, ఎ. డి. తులసీదేవి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.