నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్ లు వెంటనే రద్దు చేయాలని HMS బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు
పతెం రాజబాబు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ గోలేటి CHPలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించి 60 కోట్ల సంఘటిత అసంఘటిత కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు ఏకపక్షంగా ఆమోదించారని అన్నారు. కార్మిక సంఘాల పోరాటాల వల్ల ఇప్పటివరకు అమలు చేయకుండా వెనకకు తగ్గారని వెల్లడించారు.
ఈ రోజు (ఏప్రిల్ 1 నుంచి) దేశమంతటా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్ తాము అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, రాష్ట్రంలోని సుమారు కోటి 30 లక్షల సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు భరోసా ఇవ్వాలని HMS యూనియన్ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ MD అరీఫ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ M.ఉమామహేశ్వర్, బాలేష్, దీపక్ రాజ్, రాజేష్ పాల్గొన్నారు.