10 వేల కిలోమీటర్ల మేర వర్షపు మేఘాలు
Monsoon:రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, ఇప్పుడు రుతుపవనాలు చురుకైన దశలోకి ప్రవేశించాయని గుర్తించారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు 10 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ వర్షపు మేఘాల పట్టీని ఉపగ్రహాలు బంధించాయి. 2026 నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకైన దశలోకి ప్రవేశించాయనడానికి ఇది సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేఘాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు మాత్రం ఈ వర్షాలు ఊరటనిస్తూ, ఖరీఫ్ పంటలకు కొత్త ఆశలు నింపుతున్నాయి.
ఉత్తర భారతదేశం నుంచి హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు దాదాపు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ వర్షపు మేఘాల పట్టీని తాజా ఉపగ్రహ చిత్రాలు ఆవిష్కరించాయి. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని “మాన్సూన్ కన్వర్జెన్స్ జోన్ (Monsoon Convergence Zone)”గా పేర్కొంటూ, 2026 నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకైన దశలోకి ప్రవేశించాయని విశ్లేషిస్తున్నారు. హిందూ మహాసముద్రం నుంచి భారీగా చేరుతున్న తేమగాలులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు, అల్పపీడన వ్యవస్థలు, చక్రవాత ప్రసరణలు కలిసి ఈ విశాలమైన మేఘాల మండలాన్ని ఏర్పరినట్లు చెబుతున్నారు.
రుతుపవనాలకు భారీ ఊపు
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణ రుతుపవన వర్షాల కంటే 170-180 శాతం అధికంగా నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యంత చురుకైన వర్షపాత దశగా ఇది నిలిచింది. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు “భారీ రుతుపవన దినం”గా అభివర్ణిస్తున్నారు. ఖరీఫ్ పంటలకు అవసరమైన తేమ లభించడంతో పాటు జలాశయాలు కూడా నిండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో రుతుపవన గణాంకాలు ఈ వర్షాల వల్ల మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ చురుకైన రుతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్తో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఒకే మేఘం కాదు..
శాస్త్రవేత్తల ప్రకారం ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నది ఒకే భారీ మేఘం కాదు. ఆసియా రుతుపవన వ్యవస్థలతో అనుసంధానమైన అనేక వర్షపు మేఘాల సమూహం కలిసి ఏర్పడిన విశాలమైన వర్షపు మండలం. వెచ్చని, తేమతో కూడిన గాలి పైకి లేచి చల్లబడటంతో ఈ మేఘాలు ఏర్పడి, విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొంటాయి. ఈ ఉపగ్రహ చిత్రాలు భారత నైరుతి రుతుపవనాలు కేవలం దేశానికే పరిమితమైన వ్యవస్థ కాదని, అరేబియా సముద్రం నుంచి పశ్చిమ పసిఫిక్ వరకు విస్తరించిన ఒక భారీ వాతావరణ ప్రసరణలో భాగమని స్పష్టం చేస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది?
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వారం మొత్తం రుతుపవనాలు చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇప్పటికే ఉన్న వర్షపాత లోటు మరింత తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.