వారసులకు నేరుగా పెన్షన్

మంచిర్యాల : సింగరేణిలో పెన్షన్ తీసుకునే కార్మికుల మరణానంతరం వారి వారసులు సైతం నేరుగా పెన్షన్ పొందే అవకాశం కలగనుంది. పెన్షనర్లు మరణించిన తర్వాత వారిపై ఆధారపడ్డ వారు ఎస్బీఐ నుంచి నేరుగా పెన్షన్ పొందే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి సీఎంపీఎఫ్ ఇన్ఛార్జ్ కమిషనర్ సమీరన్ దత్తా, ఎస్బీఐ తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం పెన్షనర్ మరణానంతరం కుటుంబీకులు CMPF ఆఫీసు చుట్టూ తిరగవలసిన పని లేదు. పెన్షన్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లోనే డెత్ సర్టిఫికెట్ ఇస్తే చాలు. మరణించిన కార్మికుడి అర్హత కలిగిన కుటుంబీకులకు బ్యాంక్ పెన్షన్ ఇస్తారు. శుక్రవారం (ఏప్రిల్ 1) నుంచే ఇది అమలులోకి వస్తుంది. దీని కోసం CMPF కార్యాలయాల ద్వారా కొత్త పెన్షన్ పే ఆర్డర్ జారీ చేశారు. దీని ద్వారా 5.69 లక్షలు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి వల్లనే ఇది సాధ్యమైందని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్, ప్రధాన కార్యదర్శి వీరమనేని రవీందర్రావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు, బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి కృషి ఫలితమేనని ఈ సందర్భంగా వెల్లడించారు.