ఐదుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

విద్యుత్ జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఐదుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వీరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సంచలనం సృష్టించిన విద్యుత్ జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీక్ వెనుక ఐదుగురు విద్యుత్ శాఖ అధికారులు వున్నట్లు ప్రభుత్వం తేల్చింది. దీంతో వీరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ పరీక్ష జూలై 17న నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఓ పరీక్షా కేంద్రంలోకి శివప్రసాద్ అనే ఎలక్ట్రిషియన్ లైన్మెన్ పరీక్ష రాశాడు. పరీక్షకు సెల్ఫోన్తో హాజరయ్యాడు. శివప్రసాద్కు ఏడీఈ ఫిరోజ్ ఖాన్, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ సైదులు, సబ్ ఇంజనీర్ షేక్ షాజాన్లు సమాధానాలు చెరవేశారు.
శివప్రసాద్ సెల్ఫోన్ తీసుకొచ్చినట్టుగా గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి దర్యాప్తులో అభ్యర్థి శివప్రసాద్ వెనుక విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా తేలింది. పరీక్షకు ముందే పలువురు అభ్యర్థులతో నిందితులు.. ఒక్కో ఉద్యోగానికి రూ. 5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. వారి నుంచి అడ్వాన్స్గా రూ. లక్ష వసూలు చేశారు. మైక్రోఫోన్ సాయంతో వీరు సమాధానాలను పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు చెరవేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉన్నారు.