ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో మరోమారు విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. శనివారం రాత్రి ఈ1, ఈ2 విద్యార్థులు మెస్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి భోజనం సైతం చేయమని భీష్మించుకున్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులు మళ్లీ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎన్ని సార్లు ఆందోళన చేసినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబడుతున్నార. గతంలో తాము ఇచ్చిన 12 డిమాండ్లు పరిష్కారం కాలేదని నిరసనకు పిలుపునిచ్చారు. ఫుడ్ పాయిజనింగ్కు కారణమైన మెస్లపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని వారిపై సైతం గుర్రుగా ఉన్నారు.
కాగా.. ఈ నెల 17న బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్ఛార్జ్ వీసీతో విద్యార్ధుల చర్చలు నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. మరికొన్ని డిమాండ్లను ఇన్ఛార్జ్ వీసీ ముందు వుంచారు విద్యార్ధులు. ఈ నెల 24 లోపు వీసీని నియమించాలని విద్యార్ధులు డెడ్ లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25 నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయితే ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో వారం రోజులు పాటు క్యాంపస్లోనే ఆందోళన చేసిన ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రెండు మెస్లలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది.
తమ నిరసనకు సంబంధించి విద్యార్థులు వివరాలు పెట్టారు…
1. ఫుడ్ పాయిజనింగ్ ఘటన తర్వాత, మూడు మెస్ల కాంట్రాక్టులను జూలై 20 నాటికి రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
2. మెస్లో ఉపయోగించే పదార్థాలన్నీ టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఉపయోగిస్తున్న పదార్థాలలో ఎటువంటి మార్పును చూడలేదు..
3. ఫుడ్ పాయిజన్ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్కు చెందిన సిబ్బంది అంతా త్వరలో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
4. మెస్ మేనేజ్మెంట్కి ఇచ్చిన షోకాజ్ నోటీసు గురించి ఏమిటి? వారు ఏమైనా వివరణ ఇచ్చారా???
దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు..!!!
5. ఫుడ్ పాయిజనింగ్కు కారణమైన ఆహారం యొక్క పరీక్ష నమూనాలపై ఇచ్చిన నివేదిక ఏమిటి. కారణం బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదు…?
6. జూలై 24 నాటికి మెస్ల కోసం కొత్త టెండర్లు పిలవాలని చెప్పారు. ఇంకా జాప్యం ఎందుకు..
తమ దృష్టికి తీసుకెళ్ళే వరకు అడ్మినిస్ట్రేషన్ విభాగం ఏమీ చేయడం లేదు..!!!