విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం
-బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
-తమకు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చడం లేదని నిరసన
-వారికి మద్దతుగా తల్లిదండ్రుల కార్యాచరణ ప్రకటన
-నేడు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపీ సోయం బాపురావు

తాము ఎన్నిమార్లు చెప్పినా, ఎన్ని ఆందోళనలు చేసినా తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం పట్ల బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నుండి మెస్ లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సుమారు 3 వేల విద్యార్ధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ ను మార్చే విషయంలో అధికారులు, విద్యార్థుల మధ్య చర్చలు నడిచాయి. వెంటనే Contractorను మార్చాాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ను మార్చడానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాాల్సి ఉంటుందని ఇంచార్జీ వీసీ విద్యార్ధులకు చెప్పారు. ఈ విషయమై ఇంచార్జీ వీసీతో విద్యార్ధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దానితో పాటు కొన్ని డిమాండ్లు సైతం విద్యార్థులు అధికారుల ముందు ఉంచారు. తమకు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనకు మద్దతుగా పేరేంట్స్ కమిటీ (Parents Committee) కూడా కార్యాచరణ ప్రకటించనుంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రులు ఆదివారం హైద్రాబాద్ లో సమావేశం కానున్నారు. విద్యార్ధులకు మద్దతుగా ఈ కమిటీ కూడా ఆందోళన నిర్వహించనుంది. దీనికి సంబంధించి నేడు కార్యాచరణ ప్రకటిస్తారు. మరో వైపు బాసర ట్రిపుల్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచెల భద్రతను కొనసాగుతుంది. విద్యార్ధులు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఈ ఏడాది జూన్ లో బాసర ట్రిపుల్ ఐటీ వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy చర్చించారు.ఈ చర్చలు ఫలించాయి. దీంతో జూన్ 20న మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో జూన్ 22 నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చల్లో కొన్ని డిమాండ్లు ఇంకా నెరవేర్చలేదని కూడా విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీని ఆదిలాబాద్ ఎంపీ Soyam Bapu Rao సందర్శించనున్నారు. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు.
ఏది ఏమైనా ప్రభుత్వం 8 వేల మంది విద్యార్థుల గోసను పట్టించుకోవడం లేదని అందుకే తాము నిరసన చేస్తామని పేరేంట్స్ కమిటీ (Parents Committee) ప్రకటించింది. అదే సమయంలో మిగతా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నేతలు సైతం ఈ విద్యార్థుల నిరసనకు మద్దతు ప్రకటించనున్నాయి. అదే జరిగితే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన రాష్ట్రస్థాయిలో కొనసాగనుంది.