నల్లనేలపై బలరాముడి హరిత సేద్యం
-సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో మరో 500 మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్
-మూడేళ్లలో సొంతగా 14,000 మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తి నింపుతున్న డైరెక్టర్
-హరిత ప్రేమికులు, సింగరేణీయుల అభినందనలు

మొక్కలు నాటే కార్యక్రమం అంటే అధికారులు టక్ చేసుకుని నీట్గా వస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మొక్కను నాటుతారు. నీళ్లు పోసి ఫొటో దిగి వెళ్లిపోతారు.. కానీ, ఆయన అలాంటి వాటికి వ్యతిరేకం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో ముందుంటారు. అలా ఆయన అని ఆషామాషీ అధికారే.. తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణి సంస్థ డైరెక్టర్.. ఆయనే ఎన్.బలరామ్(ఐఆర్ఎస్)..
సింగరేణిలో మూడేళ్ల కిందట డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పీఅండ్ పీ) బలరామ్ ప్రారంభించిన హరిత హారం కార్యక్రమం నిర్విర్ఘంగా కొనసాగుతోంది. ఆదివారం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో ప్రారంభించిన మినీ ఫారెస్టు ప్రారంభం సందర్భంగా ఆయన మరోమారు 500 మొక్కలను ఒంటరిగానే నాటి అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తి పెంచారు. తాజాగా నాటిన 500 మొక్కలను కలుపుకొని మూడేళ్లుగా ఆయన ఒక్కడే సింగరేణి వ్యాప్తంగా 14,000 మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్టీపీపీ ఆవరణలో ఎకరా స్థలం విస్తీర్ణంలో ప్రారంభించిన మినీ ఫారెస్టుతో థర్మల్ విద్యుత్ కేంద్రం హరిత శోభను సంతరించుకుంటుందని డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్), ఎన్.బలరామ్ కార్యక్రమం ఆనంతరం పేర్కొన్నారు. 2019 జులై 20న కూడా ఎస్టీపీపీ ఆవరణలో డైరెక్టర్ శ్రీ ఎన్.బలరామ్ 501 మొక్కలు నాటారు.
సింగరేణి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా జూన్ 5, 2019న బంగ్లాస్ ఏరియాలో తాను 108 మొక్కలు నాటిన విషయాన్ని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సింగరేణి లో ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని, తెలంగాణ లో పచ్చదనాన్ని పెంపొందించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు హరిత హారంలో ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా మొక్కలు నాటామని తెలిపారు.
శ్రీరాంపూర్లోని ఉపరితల గని మట్టి కుప్పపై 2019 జులై 20వ తేదీన జరిగిన మెగా హరిత హారంలో డైరెక్టర్ బలరామ్ పాల్గొన్నారు. 1,237 మొక్కలను గంట వ్యవధిలో నాటి అందరూ ఆశ్చర్యపడేలా చేశారు. అదే రోజూ జైపూర్ ఎస్టీపీపీలో జరిగిన హరిత హారంలో 501 మొక్కలు నాటారు. ఇలా ఒకే రోజూ ఆయన 1700 పైగా మొక్కలు నాటడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగూడెం బంగ్లాస్ లో 205 గులాబీ మొక్కలను నాటి గులాబీ వనాన్ని ప్రారంభించారు. జపాన్ లో ప్రాచుర్యం పొందిన మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకాన్ని డైరెక్టర్ బలరామ్ ప్రయోగాత్మకంగా ఇల్లందు, భూపాలపల్లి ఏరియాలో ప్రారంభించారు.
అందరిలోనూ పర్యావరణ స్పృహను కల్పించేందుకు కృషి చేస్తున్న డైరెక్టర్ బలరామ్ సేవలను గుర్తిస్తూ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో గ్రామోదయ బంధు మిత్ర పురస్కారంతో సత్కరించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సారథ్యంలోని గ్రీన్ ఛాలెంజ్ సంస్థ ఆయనకు వన మిత్ర పురస్కారాన్ని అందజేసింది. సమాజ అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలు అందించే వ్యక్తులకు ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ప్రకటించే ప్రతిష్టాత్మక అవర్ నైబర్హుడ్ హీరో పురస్కారం కూడా డైరెక్టర్ బలరామ్ ను వరించింది. అలాగే భువనేశ్వర్లో జరిగిన అంతర్జాతీయ జియో మైన్ టెక్ అవార్డులో ఎన్విరాన్మెంట్ ఎక్స్లెన్స్ అవార్డు అందచేశారు.