ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, వడదెబ్బ నుండి కాపాడుకునేందుకు పాటించవలసిన జాగ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.