ఆదిలాబాద్ లో విమానాలు రయ్.. రయ్..
New Airport: తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఎయిర్పోర్టు నిర్మిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ అభ్యర్థన పరిశీలించిన తర్వాత భారత వైమానిక దళం (IAF) పౌర విమాన కార్యకలాపాలను అనుమతించడానికి అంగీకరించింది. అంతేకాకుండా.. ఆ ప్రదేశంలో శిక్షణా సంస్థ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తు ప్రణాళికలను కూడా పరిశీలిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉంది. ఇక్కడ ఎయిర్పోర్టు వస్తోందనే ప్రచారం సైతం చాలా ఏండ్లుగా సాగింది. అదే సమయంలో, పలుమార్లు సర్వేలు కూడా చేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే ఆదిలాబాద్కు విమానాశ్రయం రావడం లేదని పలువురు స్థానికులు ఆవేదన సైతం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎయిర్పోర్టుకు కావాల్సిన స్థలం కూడా అందుబాటులో ఉంది. ఎంపీ నగేశ్ ఇటీవల కేంద్రమంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతి పత్రం అందించారు. 2014లో వైమానిక శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు 2 వేల ఎకరాలను అధికారులు గుర్తించారు. కేంద్రానికి నివేదిక పంపారు. కానీ గత ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు అంశం నానుతూనే ఉంది.
ఆదిలాబాద్ హైదరాబాద్కు 300 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ప్రధాన నగరం నాగ్పూర్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో భారీ పరిశ్రమలు, కంపెనీలు లేవు. విమానాశ్రయం నిర్మిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురి వాదన. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించి పెద్ద అడుగు పడిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)తో కలిసి ఈ ఎయిర్ఫీల్డ్ను జాయింట్-యూజర్ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని IAF సూచించింది. దీని వలన AAI సివిల్ టెర్మినల్, ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్, సహాయక మౌలిక సదుపాయాల కోసం పక్కనే ఉన్న భూమిని సేకరించాల్సి ఉంటుంది. IAF నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదన సమర్పించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి IAF సూచించింది. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతులు ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ విమానాశ్రయం వాణిజ్య, పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.