ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేత గాజర్ల రవి మృతి
Maoist Encounter : ఏలూరు రేంజ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి(Maoist Central Committee member Gajarla Ravi) అలియాస్ ఉదయ్ మృతి చెందాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు సైతం మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో పోలీసులు మూడు ఏకే 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం మావోయిస్టులు మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ సమాచారం ఆధారంగా, ఏలూరు రేంజ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడని, అతను గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అనేక మావోయిస్టు కార్యకలాపాలకు నాయకత్వం వహించాడని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనలో మరణించిన అరుణను ఇటీవల మరణించిన మావోయిస్టు నాయకుడు చలపతి భార్యగా గుర్తించారు. ఆమె కిడారి శరత్ హత్య కేసులో కీలక నిందితురాలని సమాచారం. ఈ ఎన్కౌంటర్ మరణించిన మరో మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజుగా గుర్తించారు.
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అలియాస్ బిరుసు పేర్లతో చలామణి అవుతున్నారు. ఇతని స్వస్థలం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఇతని తలపై 25 లక్షలు రివార్డ్ ఉంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ, AOB స్పెషల్ జోనల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ అలియాస్ రూపీ. ఈమె స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్లోని కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లా. ఈమెపై 20 లక్షల రివార్డ్ ఉంది. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు. అరుణ తమ్ముడు అజాత్ సైతం కొన్నేళ్ల కిందట జరిగిన పాల సముద్రం ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఏసీఎం అంజుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.