వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
Bandlaguda electric shock:హైదరాబాద్ రామంతాపూర్ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ భారీ గణనాథుడి విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా బండ్లగూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్పై ఉన్న భారీ విగ్రహం హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో.. విద్యుత్ షాక్కు గురై ఇద్దరు యువకులు టోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు రోజుల కిందట ఇలాంటి ఘటనలోనే ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రామంతాపూర్లోని గోఖలేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఊరేగింపు పూర్తై తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడిపోయారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురు చికత్స పొందుతున్నారు.