పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
Modi ignores Pakistan Prime Minister:చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు పెద్ద షాక్ ఇచ్చారు. సమావేశానికి హాజరైన సమయంలో ఆయనతో కనీసం మోహం కూడా చూడకుండా మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సమావేశం సోమవారం ప్రారంభమైంది. ముందుగా అన్ని దేశాధినేతలు గ్రూప్ ఫొటో కోసం వరుసగా నిలబడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా వరుసలో నిలబడి ఉన్నారు. తన స్థానానికి చేరుకోవడానికి మోదీ ఆయనను దాటుకుని వెళ్లాల్సి వచ్చింది. అయితే మోదీ మాత్రం షెహబాజ్ వైపు చూడకుండానే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సంభాషిస్తున్నట్లుగా దాటుకుని వెళ్లిపోయారు.
గ్రూప్ ఫొటో తర్వాత కూడా మోదీ, షరీఫ్తో ఎటువంటి సంభాషణ జరపలేదు. బదులుగా, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కులాసాగా మాట్లాడారు. మోదీ వారితో ఎక్కువ సేపు నవ్వుతూ మాట్లాడడం కెమెరాల్లో రికార్డయింది. షరీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతే మోదీ నెమ్మదిగా వారి వెనుక నుంచి వెళ్లడం గమనార్హం. వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మోదీ సహా 20కి పైగా దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత షాంఘై సదస్సులో తొలిసారిగా భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడ్డారు.
మోదీ మాట్లాడకుండా వెళ్లిపోవడం, పాక్ ప్రధాని షరీఫ్ మాత్రం తనతో ఎవరైనా మాట్లాడుతారేమో అని ఆత్రుతగా చూస్తుడంటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెర్రరిజంపై పోరాటంలో భారత్కు పూర్తి మద్దతు చెబుతామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ టైమ్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన చైనా.. పాకిస్తాన్కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్ – పాకిస్తాన్ దోస్తీతో… పాక్కు చైనా కటీఫ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.