యూరియా కోసం రైతుల ఆందోళన
Farmers’ Concern for Urea:కొమురం భీం జిల్లా కాగజ్నగర్ లో రైతులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. భట్టుపెల్లి చౌరస్తాలో యూరియా కోసం రైతులు రోడ్డు మీద ధర్నా చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాము అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు మూడు బస్తాలు టోకెన్ రాశారని, అవి కూడా ఇవ్వడం లేదన్నారు. దొంగతనంగా అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. నాయకులకు లోపల కూర్చోబెట్టి మరీ యూరియా బస్తాలు పంపిస్తున్నారని ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ గత నెల 20న ఇచ్చారని ఇప్పటి వరకు యూరియా బస్తాలు ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. రేపు, మాపు అంటూ కాలాయపన చేస్తున్నారని దుయ్యబట్టారు. సంవత్సరం అంతా కష్టపడి పండిస్తే యూరియా లేక పంట ఎండిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఇవ్వాల్సిందేనంటూ బైఠాయించారు. ఓ వైపు వర్షం పడుతున్నా కదలకుండా యూరియా కోసం ధర్నా చేస్తున్నారు రైతులు..