ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక చేయాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister Jupally Krishna Rao at the joint Adilabad district Congress leaders’ meeting:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ముఖ్య నాయకులతో సంప్రదించి ఏకాభిప్రాయంతో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా పని చేయాలని మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు.
ఎన్నిక ప్రచారం కోసం క్షేత్రస్థాయిలో నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలను, ప్రజలకు వివరించాల్సిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే ప్రజల్లో ఉంటూ… ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలుపై ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గ, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.