తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ. 9,000 కోట్లతో కొత్త ప్లాంట్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో ఫార్మా దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్లో రూ.9,000 కోట్లతో ఒక ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ (Eli Lilly) గ్లోబల్ ప్రతినిధుల బృందం భేటీ నిర్వహించింది. అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది.ఇది రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలను అందిచనుంది.
ఎలి లిల్లీ సంస్థ తెలంగాణలో సుమారు రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా హైదరాబాద్లో ఒక అత్యాధునిక ఉత్పత్తి, నాణ్యత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కొత్త కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఎలి లిల్లీ గ్లోబల్ అధ్యక్షుడు ప్యాట్రిన్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కూడా ఈ చర్చల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. ప్రధానంగా డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎలి లిల్లీ హైదరాబాద్ నుంచి వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ ద్వారా రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.